తరచు ప్రయాణం చేసినప్పుడు మన ముందు ఉన్న వాహనాలపై ” ఐ లవ్ యు డాడీ… ఐ లవ్ యు మమ్మీ… ఐ లవ్ యు మై స్వీట్ హార్ట్… ఐ లవ్ యు మై ఫ్యామిలీ… మామ్ వెయిటింగ్ ఫర్ ఎట్ హోం... ఇలా రకరకాల స్లొగన్స్ చూడడమే కాదు ఏకంగా కొంతమంది అయితే స్పీడ్ మీటర్ వద్ద తన కుటుంబ సభ్యులు… ఇష్టమైన వారి ఫోటోలు పెట్టుకుంటారు… ఏ రోడ్డు ఎక్కిన గమ్యంతోపాటు చివరికి చేరేది ఇంటి వైపు ఉండే మమకారాలు… ఆప్యాయతలు కోరుకుంటారు… సరిగ్గా ఇక్కడే బాల్కొండ ఎస్సై కే శైలేందర్ వినూత్న ఆలోచన చేశారు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే అనుబంధాన్ని రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించేలా నడుం బిగించారు.
అనుకున్నదే తడవుగా బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థుల చేత వారి తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ తమ తల్లిదండ్రుల క్షేమాన్ని కోరుతూ విద్యార్థుల చేత పోస్ట్ కార్డులు రాయించారు… ఎస్సై కల్పించిన స్ఫూర్తితో ఏకంగా కేజీబీవీ లోని 150 మంది విద్యార్థులు తమ పేరెంట్స్ ను జాగృతం చేస్తూ పోస్ట్ కార్డుల ద్వారా రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేశారు. కస్తూర్బా గాంధీ స్కూల్ లో పిల్లలచే తమ తమ తల్లిదండ్రులకు ఒక పోస్ట్ కార్డు ద్వారా రోడ్డు భద్రత నియమాలటువంటి హెల్మెట్ ధరించడం మరియు మద్యం సేవించి బండి నడపకపోవడం రోడ్డు భద్రత జాగ్రత్తలు పాటించడం గురించి పోస్టు కార్డులో సందేశం పంపించేలా కార్యక్రమం నిర్వహించడం జరిగింది



