బాల్కొండ: సుదీర్ఘకాలం నుండి బాల్కొండ పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న మార్కండేయ మందిర పునర్నిర్మాణ పనులు శాస్త్రోక్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయానికి నూతనంగా ఏర్పాటు అయినా పాలకవర్గం ఈ నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకుని గత రెండు నెలలుగా తీవ్రంగా కృషి చేస్తుంది. బాల్కొండ పట్టణం తో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న పద్మశాలిలతోపాటు అనేకమంది మార్కండేయ మందిరం నిర్మాణం కొరకు విరివిగా విరాళాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. కాగా ఆలయ ఆస్తాన పూజారి గణేష్ జ్యోషి శాస్త్రోక్తంగా పునర్నిర్మాణ పనులను జరిపించారు. మొదట గణపతి ఆరాధన, నవగ్రహ ఆరాధన తోపాటు పలువురు దంపతులతో వైభవంగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు మహిళలు మంగళహారతితో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్న ప్రసాదన జరిగింది. కార్యక్రమంలో బాల్కొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు అందే వెంకటగిరి, కోశాధికారి కుందారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



