బాల్కొండ మండలంలోని వన్నెల్ (బి) ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం ధోండి కొబ్బని ఇందిర మే నెల 31వ తేదీన “ఉద్యోగ విరమణ” ఉన్న ప్పటికి ఏప్రిల్ 19వ తేదీన ఆర్మూర్ లోనే ఎం.ఆర్ గార్డెన్స్ లో సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ తన ప్రియ శిష్యురాలు ఇందిర “ఉద్యోగ విరమణ” సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన తర్వాత ఆమె జీవిత విశేషాలతో రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన “సన్మాన-ఆనందవల్లి-క్రోనాలజి” అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో అశోక్ కుమార్ మాట్లాడుతూ ఇందిర ఆదర్శ ఉపాధ్యాయురాలని, చురుకైన సేవకురాలని,కొందరికి ప్రేరకురాలిగా,మరికొందరికి మార్గదర్శకురాలిగా,మరెందరికి ఆదర్శ ఉపాధ్యాయురాలిగా నిబద్ధత కలిగిన ధీరోదాత్త నాయకురాలని బడియే గుడిగా విద్యార్థులే దైవ స్వరూపాలుగా భావించి 25 వసంతాలుగా విద్యారంగంలో ఎనలేని సేవలందించారని కొనియాడారు.
సన్మాన గ్రహీత ఇందిర మాట్లాడుతూ చిన్నప్పుడు మా అమ్మానాన్నలు నన్ను కష్టపడి చదివించారని అప్పుడు చదివిన చదివే ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చిందని,నేను పని చేసిన పాఠశాలలలో తల్లిదండ్రులు, గ్రామస్తులు పూర్తి సహకారం అందజేసే వారిని, విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షిస్తూ సహపాఠ్య ప్రణాళికలను మేళవించి విద్యాబోధన చేస్తుండే దానినని, నా ఆహ్వానాన్ని మన్నించి అసంఖ్యాకమైన ఆత్మీయ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి ఎంఈవో బెజ్జోర శ్రీనివాస్, పీఆర్టీయు నాయకులు పెంట జలంధర్,ప్రతాప్ రెడ్డి, దేవానందం, డి.వి నర్సింగ్ రావు, రిటైర్డ్ టీచర్స్ శ్రీనివాస్ రెడ్డి,నర్సింగ్ రావు,రెడ్డి మారుతి, అడిషనల్ పీపీ ఖాందేశ్ శ్రీనివాస్,ఆర్మూర్, వేల్పూర్,బాల్కొండ మండలాల నుండి అసంఖ్యకమైన ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా కోమన్ పల్లి తెలుగు భాషోపాధ్యాయులు కోకిల నాగరాజు, రిటైర్డ్ టీచర్ జింధం నరహరి లు వ్యవహరించారు.



