మెండోరా: మెండోరా మండల కేంద్రంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో అన్నదమ్ములైన కుమ్మరి రాజరాపు రాజేశ్వర్, రాజరాపు బక్కన్న ఇళ్లలోని గృహోపకరణాలు, నగదు సహా సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.
పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దేవుని వద్ద దీపం వెలిగించి బక్కన్న భార్య పద్మ బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న రాజేశ్వర్ ఇంటికి కూడా వ్యాపించాయి. దీంతో రెండు ఇళ్లలో భారీగా మంటలు వ్యాపించి ఆస్తినష్టం సంభవించింది.
మంటలను గమనించిన స్థానిక కాలనీవాసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే రెండు ఇళ్లలోని గృహోపకరణాలు, నగదు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి.
బక్కన్న ఇంట్లో రూ.15,800 నగదు, ఇతర వస్తువులు దగ్ధమవగా, రాజేశ్వర్ ఇంట్లో రూ.8,000 నగదు సహా సామగ్రి అగ్నికి ఆహుతైంది. రెండు ఇళ్లలో కలిపి సుమారు రూ.25 వేల మేర ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయంగా రాజేశ్వర్కు 50 కిలోల బియ్యం, బక్కన్నకు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. పూర్తి నష్టం అంచనా నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, ప్రభుత్వం నుంచి లభించే అన్ని రకాల సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.


