ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులోని రంగాచారి నగర్ లో గల అంగన్వాడి కేంద్రంలో బోధకురాలు అరుంధతి ఆధ్వర్యంలో పోషణ మాసాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ నలిని మేడం మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం-దేశ భవిష్యత్తు ఈ భావనతో ప్రతి సంవత్సరం నిర్వహించే పోషణ మాసం మన సమాజానికి ఎంతో ముఖ్యమైనది. అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యానికి, గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు పోషకాహారాన్ని అందిస్తూ సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయి.పోషణ మాసం ద్వారా తల్లిపాల ప్రాముఖ్యత,సమతుల్య ఆహారం, శుభ్రత,టీకాల అవసరం, రక్తహీనత నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది.
ఆరోగ్యవంతమైన పిల్లలు-బలమైన భారతదేశానికి పునాది.అందుకే ప్రతి కుటుంబం పోషకాహారం పై శ్రద్ధ చూపాలి అన్నారు.2 వ వార్డు కౌన్సిలర్ జగన్నాథ్ నాగేంద్ర మాట్లాడుతూ అంగన్వాడి సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, వారి కృషితో గ్రామాల్లో,పట్టణాల్లో చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతోందన్నారు అందరం కలిసి పోషణ మాసాన్ని విజయవంతం చేద్దామన్నారు “పోషకాహారం-ఆరోగ్యానికి బలమని,ఆరోగ్యమైన పిల్లలు దేశానికి వెలుగని” అన్నారు. “పోషణ మాసం” విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ బోధకురాలు అరుంధతి, ఆయమ్మ చంద్రకళ చిన్నారుల తల్లిదండ్రులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.



