ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, వినయ్ రెడ్డి ప్రత్యేక సహకారం మరియు కృషితో మచ్చర్ల గ్రామానికి సుమారు 30 నుండి 40 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన పేద ప్రజలకు గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ఈ ఇళ్లను మంజూరు చేయించడం జరిగిందని, అందులో భాగంగానే నేడు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాలూర్ చిన్న ఊశన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మంతెన సంజీవ్, కోర్వ రమేష్, మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఇళ్లు మంజూరు చేయించడంలో చొరవ చూపిన వినయ్ రెడ్డికి గ్రామస్థులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.



