చిట్యాల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 8 పిట్టగూళ్లు ఏర్పాటు
నిర్మల్: పక్షులకు గూళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుకూలమైన వాతావరణం తగ్గిపోవడంతో వాటికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చిట్యాల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 8 పిట్టగూళ్లను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ–వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరుల సహకారంతో ఈ పిట్టగూళ్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యుడు సతీష్ మాట్లాడుతూ.. పిట్టలు, ఇతర పక్షులు ప్రకృతిలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. పక్షులకు ఆహారం, నీటితో పాటు గూడు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పక్షుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి ఇంటి పరిసరాల్లో పిట్టలకు నీరు, ఆహారం అందించేలా గ్రామస్థులు ముందుకు రావాలని కోరారు.
గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పిట్టగూళ్లు ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంచి స్పందన తెలిపారు. పక్షుల సంరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని వారు కోరారు.




