మెండోరా: మహిళలు బైక్లు, ఆటోలలో ప్రయాణించే సమయంలో బంగారు ఆభరణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని సూచించారు. మెడలో ధరించిన బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలను చున్నీ, స్కార్ఫ్ లేదా చీర కొంగుతో కప్పి ఉంచుకోవాలని ఆమె తెలిపారు.
ఇటీవలి కాలంలో చైన్ స్నాచింగ్ ఘటనలను దృష్టిలో ఉంచుకుని మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. గ్రామాలు, కాలనీల్లో ఎవరైనా మాస్క్ ధరించి లేదా నంబర్ ప్లేట్ లేని వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వారిని ప్రశ్నించి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
అలాంటి వ్యక్తులపై అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు.



