ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో ప్రముఖ సామాజిక సేవకుడు తులసి పట్వారి ఆధ్వర్యంలో ఎల్.కే ఆసుపత్రి అధినేత డాక్టర్ అశోక్ చేతుల మీదుగా తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ జాగ్రత్తలు గురించి కరపత్రాన్ని తులసీ పట్వారి ఆవిష్కరింపజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ఈ తీవ్ర ఎండల్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని,అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీరు, లవణాలు తగ్గిపోవడం ద్వారా వడదెబ్బ వచ్చే ప్రమాదం ఉందన్నారు.
శరీరంలో కోల్పోయిన ద్రవాలు, లవణాలను త్వరగా పునరుద్ధరించడంలో ఓఆర్ ఎస్ సహాయపడుతుందని, ఇది అలసట,తలనొప్పి,దాహం వంటి లక్షణాలను తగ్గించి శరీరాన్ని సత్వరం చురుకుగా మారుస్తుందని,ఎండల్లో ఎక్కువగా బయట తిరిగేవారు పిల్లలు, వృద్దులు తప్పనిసరిగా ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల వడదెబ్బ నుండి రక్షించుకోవచ్చన్నారు.ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ నీటిలో కలిపి తాగడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని అవసరానికి అనుగుణంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు.”ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి” ఓఆర్ఎస్ తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని ప్రజలకు హితవు పలికారు.


