బాల్కొండ: వచ్చే 2047 నాటికి భారతదేశం విశ్వ గురువు స్థానంలో నిలుస్తుందని ప్రముఖ మోటివేటర్, సామాజికవేత్త అప్పల ప్రసాద్ ఘాంట పతంగా ఉద్ఘాటించారు. బాల్కొండ ఎం కే గార్డెన్లో జరిగిన హిందూ సమ్మేళనం లో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. 500 ఏళ్లు ఇంట్లో పూజ కూడా చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ దేశ ప్రజలు ఉన్న తరుణంలో హిందువుల మనుగడ కోసం చత్రపతి శివాజీ వంటి ఒక యోధున్ని ఈ జాతికి అందించిన జిజాబాయి వంటి తల్లులు ఉన్న మాతృభూమి భారతదేశం అని అన్నారు. 99 లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు 17 బుల్లెట్లతో కొనఊపిరితో మంచు కొండలు దాటి దేశ సేవను అందించిన సైనికులు ఉన్న దేశం మనదని అన్నారు. కొన్ని దేశాల్లో తండ్రులేరని, మరికొన్ని దేశాల్లో తల్లులు లేరని ఇంకొన్ని దేశాల్లో అసలు పిల్లలు లేకుండా వృద్ధులే మిగిలారని అన్నారు. భారతదేశంలోనే 42 కోట్ల కుటుంబాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయని విదేశీ పోకడలకు పోకుండా కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులపై ఉందని అన్నారు. కుటుంబ వ్యవస్థకు శ్రీరాముని జీవిత చరిత్ర ఒక చక్కని నిదర్శమని అన్నారు.
ఎక్కడో అమెరికాలో పుట్టి తమ తల్లిదండ్రులు ఈ దేశానికి చెందినవారు కాకపోయినా తన పూర్వీకులను కేరళ, గుజరాత్ లో వెతుక్కున్న సునీత విలియమ్స్ అంతరిక్షం నుండి 8 నెలల తర్వాత కిందికి దిగుతూ తన వెంట గణపతి ప్రతిమను, భగవద్గీతను తెచ్చుకోవడం ఆమె తల్లి నేర్పిన నడవడికకు నిదర్శమని కుటుంబ వ్యవస్థ తోనే ఈ దేశము మరింత పురభివృద్ధి సాధించగలరని అన్నారు.
200 ఏళ్ళు పరిపాలించిన ఆంగ్లేయులు ఇండియన్స్ తో పరిపాలన చేతకాదన్న వారికి తమ దేశం సవాల్ విసిరిందని జిడిపిలో నాలుగో స్థానం సాధించి అమెరికాకే అప్పులు ఇచ్చే స్టేజ్ కు ఎదిగిందని గుర్తు చేశారు. వైజ్ఞానిక రంగంలో 168 స్థానంలో ఉన్న భారతదేశం ఏకంగా ఈరోజు 30 దేశాలకు అంతరిక్ష యానం వసతులు కల్పించడం ఈ దేశ పురోభివృద్ధికి మైలురాయని అన్నారు.
సత్యానంద ఆశ్రమం గురూజీ విశోక తీర్థ స్వామి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నాశనం చేసే స్థితిలో ప్రభుత్వాలు పాలకులు ఉన్నారని దేవాలయాల్లో మనం వేసే కానుకలతోనే మన ధర్మాన్ని నాశనం చేసే స్థితికి చేరారని వారికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి మనందరిపై ఉందని అన్నారు. ఇకనుండి గుడులకు వెళ్లే భక్తులు కానుకలకు బదులు తమ హిందువుల డబ్బును దేనికి వినియోగిస్తున్నారో నిలదీసే చిట్టిలను వెయ్యాలని పిలుపునిచ్చారు. అమృత ధార ఆశ్రమ స్వామిజి హరాచారి నారాయణ స్వామీజీ మాట్లాడుతూ నేడు కొంతమంది సహజ జీవనం గడిపితే మరికొందరు పరోపకారంతో జీవిస్తున్నారని అన్నారు. సహజ జీవనం వల్ల కుటుంబాలే బాగుపడుతున్నాయని పరోపకారం తో జీవించే వారితో ఈ సమాజం వృద్ధి చెందుతుందని అన్నారు.
కార్యక్రమంలో హిందూ సమ్మేళనం సమితి అధ్యక్షులు కుందారం శంకర్, ప్రధాన కార్యదర్శి కత్రాజీ నరేందర్, ఇన్చార్జులు కోడిచెర్ల రామకృష్ణ, అంబటి కిషన్, సల్ల నరసయ్య, గుమ్మల విజయ్, రాజేందర్ గౌడ్, తౌట్ రాజేష్, కత్రాజి శ్రవణ్, అంబటి నవీన్, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.



