మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడులో గల తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం మరియు మత్తు పదార్థాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కలిగి ఉండి, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు.
అలాగే యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్య, క్రీడలు, మంచి అలవాట్లపై దృష్టి సారించాలని, మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై జాదవ్ సుహాసిని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని, సైబర్ భద్రత, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన పొందారు.