ప్రాజెక్టు అధికారులతో సమీక్ష – నీటి నిల్వలు, మరమ్మత్తులు, సాగునీటి విడుదలపై చర్చ
మెండోరా:మెండోరా మండలంలోని పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సార్ఎస్పీ)ని శనివారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులతో పాటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జి. వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా పాల్గొన్నారు.
ప్రాజెక్టు అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రస్తుత నీటి నిల్వలు, భవిష్యత్తులో నీటి లభ్యత, ప్రాజెక్టులో చేపట్టాల్సిన మరమ్మత్తులు, నిర్వహణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు సాగునీరు సకాలంలో అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని, పంటల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై సమగ్ర ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.
ప్రాజెక్టు భద్రత, నిర్వహణ, నీటి వినియోగంలో సమర్థత పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు.