subhodayam.news
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 5:11 pm Digital Edition : Narendhar

కిసాన్ నగర్ పీహెచ్‌సీలో జిల్లా వైద్యాధికారి డా. రాజశ్రీ ఆకస్మిక తనిఖీ

బాల్కొండ: జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి డా. రాజశ్రీ శుక్రవారం కిసాన్ నగర్ పీహెచ్ సీ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని OP, ఫార్మసీ, ల్యాబ్, HPV వ్యాక్సినేషన్ సెంటర్లను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల నిల్వ, పరీక్షల వివరాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాకాలంలో విరేచనాలు, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. OPకి వచ్చే ప్రతి జ్వరం కేసును పూర్తిగా పరీక్షించి, అవసరమైన రక్త పరీక్షలు చేయాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. శుభ్రత పాటించి, క్లీనింగ్ పనులను క్రమం తప్పకుండా చేయాలని సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని, అందులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.ఈ తనిఖీల్లో పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.