మెండోరా::మెండోరా మండలంలో గత 24 గంటల్లో 115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో, రానున్న 36 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన దృష్ట్యా మండలంలోని గ్రామ పాలనా అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని మెండోరా తహసీల్దార్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో వర్షాలకు నానిన పెంకుటిళ్లలో వృద్ధులు, చిన్నారులు నివసించకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లను గుర్తించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అలాగే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతున్నందున ఎప్పుడైనా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలకు గొర్రెల కాపరులు, పశువుల కాపరులు, రైతులు లేదా ఇతరులు వెళ్లకుండా గ్రామాల్లో మైకుల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.