మెండోరా మండలం నేషనల్ హైవే 44 పైన బుస్సాపూర్ గ్రామంలో ఇటీవల సంచలనం రేపిన చైన్ స్నాచింగ్ సంఘటనలో మెండోరా పోలీసులు ఎట్టకేలకు నిందితుడి ని వారంలోపే పట్టుకున్నారు. ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
గత శనివారం సోన్పేట్ గ్రామానికి చెందిన ఉప్పరి గణేష్ తన భార్య గంగు, కూతురు మనీషాతో కలిసి ముప్కాల్ నుండి తన టీవీఎస్ ఎక్సెల్ బండి మీద సోన్పేట్కు వెళ్తుండగా, సాయంత్రం దాదాపు 4.30 గంటలకు బుస్సాపూర్ శివారులోని ఎన్హెచ్-44 రహదారిపై ఒక గుర్తు తెలియని దొంగ ముఖానికి మాస్క్ ధరించి సైకిల్పై వచ్చి, వెనుక కూర్చున్న గంగు మెడలోని రెండు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు.
మెండోరా ఎస్.ఐ సుహాసిని ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి కోసం గాలించి, ఈరోజు అతన్ని పట్టుకున్నారు. దొంగిలించబడిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఆర్మూర్ రూరల్ సి.ఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితుడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన గుర్జంత్ సింగ్ అని వెల్లడించారు.
నిందితుడిని పట్టుకోవడంలో సహకరించిన ఎస్సై సుహాసిని తో పాటు హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుల్ భరత్ గౌడ్, లింగన్న, షౌకత్లను సి.ఐ జాన్ రెడ్డి అభినందించారు.


