subhodayam.news
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 5:43 pm Digital Edition : RAJU CH

మెండోరా మండల విఓఏల సమ్మెకు ఏపీఎం, సీసీల మద్దతు

మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న విఓఏల సమ్మె నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మండల ఐకేపీ ఏపీఎం గంగరాజు, సీసీలు అన్నపూర్ణ, ప్రణిత, బాల్‌రాజు మరియు మండలంలోని ఓబీలు సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా మెండోరా విఓఏల మండల అధ్యక్షురాలు కళావతి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు విఓఏలకు కనీస వేతనం రూ.26 వేలుగా పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విఓఏల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారని, కానీ ప్రస్తుతం మంత్రి అయిన తర్వాత కూడా విఓఏల సమస్యల పరిష్కారంపై స్పందించడం లేదని విమర్శించారు.
ప్రస్తుతం విఓఏలపై పనిభారం పెంచుతూ అనేక బాధ్యతలు అప్పగిస్తున్నప్పటికీ, వేతనాల పెంపుపై మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. గ్రామ సంఘాలు లాభాల్లో ఉంటే వాటి నుంచి వేతనాలు తీసుకోవచ్చని ఇటీవల సెర్ప్ సీఈఓ జారీ చేసిన జీవో సమ్మెను నీరుగార్చేందుకు చేసిన ప్రయత్నమని ఆరోపించారు.
ఈ సందర్భంగా విఓఏలు ప్రభుత్వం ముందు రెండు ప్రధాన డిమాండ్లు ఉంచారు.
విఓఏలకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలి.
విఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి.
తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏపీఎం గంగరాజును కళావతి కోరారు.