బాల్కొండ: రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు వంటి అనేక అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలను జాగ్రత్తం చేయడంలో పోలీసులు తమకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ కోవలో మెండోరా ఎస్సై సుహాసిని జాదవ్ మరో అడుగు ముందుకు వేసారు… మండుటెండలు సైతము లెక్కచేయకుండా ఉపాధి కూలీలను వెతుక్కుంటూ వెళ్లి వారి కష్టార్జితం ను కాపాడుకునేలా సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మెండోరా మండలంలోని కోడిచెర్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించారు. అలాగే కల్తీ కల్లు సేవించడం ఆరోగ్యానికి హానికరమని, వాటికి దూరంగా ఉండాలని తెలిపారు.
రోడ్ సేఫ్టీపై కూడా కూలీలకు సూచనలు చేస్తూ, బైక్పై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 18 సంవత్సరాలు నిండని వారికి వాహనాలు ఇవ్వవద్దని చెప్పారు. కారులో ప్రయాణించే సమయంలో సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని వివరించారు.వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లలను చెరువులు, బావులు వంటి ప్రమాదకర ప్రాంతాలకు ఈత కోసం పంపవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై సూచించారు.