2026 మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ రాత పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో వెలుగుచూసిన పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో మే 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై త్వరలో ప్రకటన విడుదల చేస్తామని NTA ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీన జరిగిన NEET UG 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్లో గెస్ పేపర్ లీక్ అయ్యిందన్న ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అంతేకాదు ఈ లీక్ వెనుక ఉన్న అసలు కారణాలను, ఇదుకు కారకులైన వారిని గుర్తించడానికి ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( CBI) విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.
మళ్లీ పరీక్ష నిర్వహణ కు సన్నాహాలు
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రద్దయిన పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహించనున్నట్లు NTA స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని.. విద్యార్థులు చెల్లించిన పరీక్షా ఫీజును తిరిగి రీఫండ్ చేస్తామని అధికారులు ప్రకటించారు .
రాజస్థాన్లో గెస్ పేపర్ లీక్ అయ్యిందనే ఆరోపణలు రావడంతో NTA దర్యాప్తు ముమ్మరం చేసింది. అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గెస్ పేపర్ లో ఉన్న 140 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రశ్నల్లోని జవాబు క్రమం కూడా అసలు పేపర్తో మ్యాచ్ కావడంతో వివాదం మరింత ముదిరింది. గెస్ పేపర్ మాదిరి తయారు చేసిన ఈ మెటీరియల్ మే 1వ తేదీన రాజస్థాన్లో చక్కర్లు కొట్టినట్టు అధికారులు గుర్తించారు. దీనిని విద్యార్ధులు రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు అధికారులకు సమాచారం లభించింది.
కేరళకు చెందిన ఓ విద్యార్ధి సికార్లో కొనుగోలు చేయగా.. ఇది గంటల వ్యవధిలోనే కేరళలోని పలు కోచింగ్ నెట్వర్క్లకు, పీజీలకు, కెరీర్ కౌన్సెలర్లు, నీట్ అభ్యర్ధులకు పంపిణీ అయ్యింది. పరీక్ష తర్వాత ఓ పీజీ ఆపరేటర్ పోలీసుకు, NTAకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.